Wednesday, March 31, 2010

"నిజాం కు ఘోరి కడితే!!!

 "నిజాం కు ఘోరి కడితే న్యాయం జరిగిందా మనకు ! అన్యాయమే(నా) బ్రతుకంతా అడిగుతోంది తెలంగాణా !" అని 'బతుకమ్మ' సినిమాలో అందెశ్రీ పాట రాసుకున్నాడు. అవును అన్యాయం, నిరంకుశత్వం రూపం మారింది, తరతరాలుగా కొనసాగుతోంది. అది సీమాంధ్రకు చెందిన కొందరు వ్యక్తులు అని నిర్మొహమాటంగా తెలంగాణకు చెందిన స్కూలుకు పోయే పోరడు కూడా చెప్తడు.  తెలంగాణా యాస లో మాట్లాడితే కింది నుండి పైదాక చూస్తారు కొందరు, అదేదో నేరం అయినట్టు. ఇటు తెలంగాణాలో నాణ్యమైన విద్యకు సదుపాయాలు సరిగ్గా లేవు, ఈ ప్రాంతం ఇంగ్లీషు వాళ్ళ చేత పాలించబడలేదు, క్రిస్టియన్ మిషినరీస్ లేవు. ఉన్నదల్లా నిరంకుశ నిజాం ప్రభుత్వాలు, ఉర్దూ మీడియం స్కూళ్ళు, అపుడు బలవంతంగానే మాది కాని భాషను నేర్చుకున్నాం. ఇప్పుడు కూడా అంతే, మావి కాని వాటిని ఎన్నింటినో నేర్చుకుంటున్నాం. మా సంస్కృతి కల్తీ అయింది. ఉనికినే కోల్పోతోంది.  మమ్మల్ని మేం ఏవిదంగా ఎదుటివాళ్ళకు చెప్పుకోవాలో తెలియని అసహాయస్థితి. ఇది అస్థిత్వాన్ని కాపాడుకోవాలనుకొనే ఆరాటం. పోరాటం. ఇపుడు మా యాస రోతగానే ఉంటుంది,మా సంస్కృతి వికారంగానే ఉంటుంది. అవును వాళ్ళకు పెద్ద, పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి, వ్యవసాయంలో లాభాలు పెరిగాయి, ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించారు, ప్రసార మాధ్యమాలు స్థాపించారు, వాళ్ళ భాషనే ప్రామాణికమైనదిగా, వాళ్ళ సంస్కృతినే ఉత్తమమైనదిగా  ప్రచారం చేయడం మొదలుపెట్టారు, తెలంగాణా భాషను, సంస్కృతిని హీనమైనదిగా చిత్రీకరించారు. ఇది హింస. భాష, సాంస్కృతికపరమైన హింస, మానసిక హింస కాదా? మాకంటూ ఒక సంస్కృతి లేదా? దాన్ని గౌరవించాల్సిన భాద్యత ఆంధ్ర వాళ్ళకు లేదా? సాంస్కృతిక, నాగరికతపరమైన అంతరాలు పెరిగిపోయే ప్రమాదాన్ని విలీనం చేసేటపుడు పెద్ద మనుషులు ఉహించాలేదా? మొదట్లోనే ఆ అంతరాల్ని తగ్గించే ప్రయత్నాన్ని ఎవరూ ఎందుకు చేయలేదు? విలీనం వెనుక దాగి ఉన్న ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతాయి అనే నమ్మకం రాగానే సంస్కృతీ, నాగరికతల గోల ఎందుకని వదిలేశారా? విలీనం రాజకీయంలో బాగం  కాదా? రాజకీయ కుట్ర కాదా? అది రాజకీయ నిరుద్యోగులది కాదా?  అపుడు ఎవరి ఏకాభిప్రాయంతో ఈ మోసానికి ఒడిగట్టారు? ఏ ప్రాంత ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కోరారు?  ఏ అసెంబ్లీ లో  తీర్మానం ప్రవేశ పెట్టారు? ఎంత మెజారిటీతో ఆమోదించారు? ఎవరి అనుమానాలను నివృత్తి చేశారు?
రాజకీయవాదులు ఇలాంటి అంతరాలను తమ స్వార్ధానికి ఉపయోగించుకుంటే తప్పేంటి? అది రాజకీయాల్లో ఒక బాగం. సహజంగానే రాజకీయ నాయకులు ఇలాంటి అవకాశాలు, అంతరాల కోసమే ఎదురు చూస్తారు లేదా సృస్టిస్తారు. అసలు ఎందుకు ఈ పరిస్థితి ఇంతదాకా వచ్చింది? కారకులు ఎవరు? వాళ్ళకి శిక్ష ఏంటి? విలీనంతో తెలంగాణా ఎంత మూల్యం చెల్లించిందో ఏ కమిటి నిర్ధారణ చేయగలదు? ఆ నివేదికలను ఏ ప్రభుత్వాలు పట్టించుకోగలవు?
        అసలు తెలంగాణా -ఆంధ్ర సమస్యను "జాతుల పోరాటం"గా వర్ణించాడు ఈ మధ్య ఒక మహానుభావుడు. అపుడు బలవంతంగానే మాటలు కలిసాయి, మనస్సులో ఏదో తెలియని అసౌకర్యం. భాషలో సారుప్యత ఉన్నా, యాస లో ఎంతో తేడా ఉంది. తెలుగు భాషగా ఉండటం తెలంగాణా వాళ్ళ పాలిట శాపమైంది. అది ఎన్ని దశాబ్దాల తర్వాత విమోచనం అవుతుందో ఎవరు మాత్రం ఉహించగలరు? 'చీమ చిటుక్కుమన్నా హైకమాండ్ కు   విన్నవించుకొని, అక్కడి నుండి వచ్చే ఆజ్ఞ తర్వాతే ఏదైనా చేసే నీచ రాజకీయవాదులను మనం ఎన్నుకుంటున్నామా? అని ప్రజల్లో ఎప్పుడు చైతన్యం వస్తోందో అని ఎదురుచూస్తున్నా! ఇది మన సమస్య మనమే ఎందుకు పరిష్కరించుకోలేం అనే విచక్షణ మన ప్రజా ప్రతినిధులకు ఎపుడు వస్తుందో అని కూడా ఎదురుచూస్తున్నా!
చివరగా, ఎన్నో పోరాటాల చరిత్ర, స్పూర్తి కలిగిన తెలంగాణా  మనది. దాన్ని పూర్తిగా చదువుదాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నా విద్యార్ధి సోదర, సోదరీమణుల్లారా ! ఆత్మ హత్య ల సంస్కృతి మనది కాదు, ఎలాంటి ప్రతికూల పరిస్థితులకైన, నిరంకుశ ధోరణులకైనా ఎదురునిల్చి పోరాడిన చరిత్ర మనది. పోరాటం మన నైజం. ఒక్కొక్కరైనా సరే బ్రతికి పోరాడి భావి తరాలకు స్ఫూర్తిదాయకమైన సందేశాన్నిద్దాం. 
 ----DSTలో బతుకమ్మ సినిమాచూసాక రగిలినస్పూర్తితో..!!

                                                                                                   

Tuesday, March 30, 2010

ప్రేమ మరియు పెళ్లి

'ప్రేమ' అనేది  యువతను ఎప్పటికి ఉల్లాసపరిచేదే. ఆ పదంలోనే ఏదో మత్తు దాగి ఉన్నట్టుంది. దాని గురించి మాట్లాడుకోవడం అన్నా, వినడం, చదవడం అన్నా ఆసక్తిగానే ఉంటుంది.   ప్రేమను మొదలు పెట్టడం సులభం, కానీ దాన్ని నిలుపుకోవడం అనేది మాత్రం ఒక కళ. ఈ మధ్య, ప్రేమించుమనో, ప్రేమిస్తున్న అమ్మాయి దక్కలేదనో, కొందరు యువకులు హింసాత్మక మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇది ఆధునిక సమాజానికి మచ్చ లాంటిది, అభ్యున్నతికి అవరోధం కుడా.  'ప్రేమ' అనే ప్రయాణంలో పెళ్లి ఒక మలుపు లాంటిదే కానీ అదే గమ్యం కాదు అని నా అభిప్రాయం. ''సఫలం అయిన ప్రేమ పెళ్లి వరకు, విఫలం అయిన ప్రేమ చితి వరకు" అని తనికెళ్ళ భరణి గారు అన్నట్టు, పెళ్లి మాత్రమే పరమావధి కాకూడదు. కొన్ని సామజిక లేక వేరే ఇతర కారణాల వల్లనో ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకోలేకపోవచ్చు, కానీ వారి ప్రేమను ఎవరు, ఏ శక్తి అడ్డుకోగలదు? ప్రేమ అనేది మనస్సుకు సంబంధించింది.  ప్రేమ తర్వాత  పెళ్లి అనేది కేవలం ఒక సంఘటనగా అభివర్ణిస్తాను. అది జరిగినా , జరుగక పోయినా ప్రేమ జీవనదిలా మనసులో ప్రవహిస్తూ ఉండాలి. దేన్నీ ఆశించకుండా, అనునిత్యం, ఎదుటి వ్యక్తి క్షేమం కోరేదే ప్రేమంటే. ప్రస్తుత సమాజంలోని చాలా మంది యువకులు ప్రేమంటే తమ ప్రియురాలిని సొంతం చేసుకోవడం లేదంటే, కాదంటే, అంతం చేయడం అని భావిస్తున్నారు, బ్రమల్లో జీవిస్తున్నారు. నిజానికి మన సాహిత్యం, ప్రసార మాధ్యమాలు ప్రేమకు సరైన నిర్వచనాన్ని ఇవ్వడంలో  విఫలం అయ్యాయి అనే చెప్పుకోవాలి. లేదంటే ప్రేమించే అమ్మాయిపై  పలురకాల దాడులకు దిగడం అనే ఆలోచనావిధానం ఎక్కడి నుండి వచ్చింది? విచక్షణ అనే దాన్నే మరిచిపోతున్నారు. ఇలాంటి సంఘటనలు మన కుటుంబం లో జరిగితే తట్టుకోగలమా ! భావి భారత పౌరుల్లారా ఇక ముందైన మనం మనుషుల్లాగా వ్యవహరిద్దాం, కొన్ని మానవ విలువల్ని భావి తరాల కోసం కాపాడుదాం !!
ఏమంటారు ?!